వినాయకుని జననం & గణాధిపత్యం
పూర్వం పార్వతీదేవి నలుగు పిండితో ఒక బాలుని బొమ్మను చేసి, ప్రాణం పోసింది. అతడిని ద్వారపాలకుడిగా ఉంచి స్నానానికి వెళ్ళింది. ఆ సమయంలో ఈశ్వరుడు రాగా, ఆ బాలుడు అడ్డుకున్నాడు. దాంతో కోపోద్రిక్తుడైన పరమేశ్వరుడు ఆ బాలుని శిరస్సును ఖండించాడు. పార్వతీదేవి దుఃఖించగా, పరమేశ్వరుడు గజము (ఏనుగు) శిరస్సును తెప్పించి బాలునికి అమర్చి ప్రాణం పోశాడు. దేవతలందరూ ఆ బాలునికి గణాధిపత్యం ఇవ్వాలని కోరగా, పరమేశ్వరుడు త్రిలోక సంచారం చేసి ముందుగా వచ్చేవారికి గణాధిపత్యం ఇస్తానని ప్రకటించాడు. కుమారస్వామి తన నెమలి వాహనంపై వేగంగా వెళ్లగా, వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణం చేసి, సర్వలోకాల కంటే తల్లిదండ్రులే మిన్న అని నిరూపించి, గణాధిపత్యం పొందాడు.